Saturday, June 7, 2008

పోర్టుభూముల కేటాయింపుపై ఆందోళన

కాకినాడ పోర్టుభూములు అక్రమ కేటాయింపులపై పార్టీ తరపున ఆందోళన చేపడతామని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. బుధవారం 'ఈనాడు'లో 'అడ్రస్‌లేని కంపెనీలు' శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. 354 ఎకరాల విలువైన భూమిని పోర్టుతో ఏవిధంగానూ సంబంధంలేని కంపెనీలకు ప్రభుత్వం అప్పగించడం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించిన వారికి ఈ భూములు ధారాదత్తం చేశారన్నారు. 1994లో తెదేపా ప్రభుత్వం పోర్టు భూముల కేటాయింపుపై ప్రత్యేకంగా నియమ నిబంధనలను పెట్టిందన్నారు. పోర్టుతో సంబంధం ఉండి దానితో వ్యాపారాలు చేసేవారికే నిబంధనలకు లోబడి భూములు కేటాయించాలని దానిలో స్పష్టం చేశామన్నారు. లీజుకు ఇవ్వడానికి మార్కెట్ విలువకు 6 శాతం అద్దెవిలువ చెల్లించాల్సి ఉంటుందని ఆ తర్వాత ప్రతి మూడేళ్ళకు 15 శాతం అద్దె పెంచాల్సి ఉంటుందన్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఏటా వందల కోట్ల రూపాయలు 30 ఏళ్ళపాటు కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతోందని లెక్కతేలుతోందన్నారు. అక్రమంగా కేటాయింపులు చేసిన ఈ భూములను తక్షణం ప్రభుత్వం రద్దు చేయకుంటే ఈ నెల 12 తర్వాత నుంచి పార్టీ ఆందోళన చేపడుతుందన్నారు. తొలుత భూములు పరిశీలన ఆ తర్వాత ధర్నాలు, నిరసనలు చేస్తామన్నారు.

No comments: